దుమ్మురేపిన 'వందే భారత్'.. ట్రయల్ రన్ లో 180Kmph వేగం
దిల్లీ:
దేశీయంగా అభివృద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైలు అయిన వందేభారత్ (Vande Bharat) దుమ్మురేపింది. తాజాగా నిర్వహించిన ట్రయల్ రన్లో గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని నమోదు చేసింది.దీనికి సంబంధించిన వీడియోలను రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విటర్లో పోస్ట్ చేశారు.2019లో తొలి వందేభారత్ రైలు దేశంలో అందుబాటులోకి వచ్చింది. న్యూదిల్లీ- వారణాసి మార్గంలో దీన్ని తొలుత అందుబాటులోకి తీసుకొచ్చారు. దిల్లీ-వైష్ణోదేవీ (జమ్మూ) మార్గంలో రెండో రైలును ప్రవేశపెట్టారు.
తాజాగా కోటా (రాజస్థాన్)- నగ్దా (మధ్యప్రదేశ్) సెక్షన్లో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకున్నట్లు కేంద్రమంత్రి తన ట్విటర్లో పోస్ట్చేశారు.రైలు వేగాన్ని కొలిచే స్పీడో మీటర్ యాప్ను స్మార్ట్ఫోన్లో ఆన్ చేసి దాన్ని రైలు విండో పక్కన పెట్టి వీడియోను చిత్రీకరించారు. ఓ దశలో రైలు 183 కిలోమీర్ల గరిష్ఠ వేగాన్ని అందుకోవడం ఆ వీడియోలో కనిపించింది. అంత వేగంతో వెళ్తున్నా.. పక్కనే ఉన్న మంచినీళ్ల గ్లాసు పెద్దగా కుదుపులకు లోనుకాకపోవడం విశేషం.